దిగ్గజ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత

  • మ్యూనిచ్‌ వరల్డ్‌కప్‌ నుంచి వస్తూ అస్వస్థతకు గురైన రాణా
  • భారత పిస్టల్‌ జట్టుకు హై-పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా సేవలు
  • కామన్వెల్త్‌ క్రీడల్లో 15 పతకాలు సాధించిన ఘనత
  • మను భాకర్‌తో పాటు పలువురు స్టార్‌ షూటర్లకు కోచ్‌గా సేవలు
  • అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత
  • ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
భారత దిగ్గజ షూటర్‌, ప్రముఖ కోచ్‌ జస్పాల్‌ రాణా (49) కన్నుమూశారు. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం భారత పిస్టల్‌ షూటింగ్‌ జట్టుకు హై-పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న జస్పాల్‌ రాణా, ఒలింపిక్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మను భాకర్‌తో పాటు పలువురు భారత షూటర్లకు శిక్షణ ఇచ్చారు.

జస్పాల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  ‘‘జస్పాల్‌ రాణా మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటు. షూటింగ్‌లో సాధించిన అసాధారణ విజయాలతో దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. క్రీడల పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రతిభను వెలికితీయాలనే తపన అందరి ప్రశంసలు పొందాయి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని తన సందేశంలో తెలిపారు.

 ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు కలికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ దేవ్‌ పేర్కొన్నారు.

ఆటగాడిగా జస్పాల్‌ రాణా అత్యంత విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగు ఎడిషన్లలో పాల్గొని మొత్తం 15 పతకాలు సాధించారు. వీటిలో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. అలాగే ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచి భారత షూటింగ్‌కు విశేష సేవలందించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1994లో అర్జున అవార్డు, 1997లో పద్మశ్రీ పురస్కారం లభించాయి. కోచ్‌గా చేసిన సేవలకుగానూ 2020లో దేశ అత్యున్నత కోచింగ్‌ పురస్కారం ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు.

షూటర్‌గా విజయవంతమైన ప్రయాణం అనంతరం కోచ్‌గా మారిన జస్పాల్‌ రాణా, భారత షూటింగ్‌కు కొత్త తరం ఛాంపియన్లను అందించారు. ముఖ్యంగా పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్‌ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర పోషించారు. సౌరభ్‌ చౌదరి, అనీష్‌ భాన్వాలా, చింకీ యాదవ్‌ వంటి పలువురు షూటర్లకు కూడా ఆయన మార్గనిర్దేశం చేశారు.

 

Jaspal Rana
Shooter
Manu Bakar
India
Sports
Modi

More Telugu News